దక్షిణ భారతీయులకు ఎంతో సుపరిచితమైన చిరుధాన్యాల్లో ప్రధానమైనవి ‘రాగులు’. వీటినే ఫింగర్ మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. రాగులతో తయారు చేసిన ఆహారం రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో భాగంగా తయారు చేసిన రాగి లడ్డూలను రోజు తినడం వలన చిన్నారులకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ క్రమంలో రాగి లడ్డూ తయారీ విధానం తెలుసుకుందాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి : ఒక కప్పు
నెయ్యి : అరకప్పు
బెల్లం : ఒక కప్పు
పచ్చి కొబ్బరి : పావు కప్పు
నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు
పల్లీలు : కొన్ని
బాదం పప్పు : కొంచెం
జీడిపప్పు : కొంచెం
యాలకుల పొడి : తగినంత
తయారీ విధానం:
ముందుగా స్టౌ వెలగించి బాణలి పెట్టి.. అందులో నువ్వులు, పచ్చి కొబ్బరి మరియు పల్లీలను వేర్వేరుగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పల్లీలపై ఉన్న పొట్టును తీసివేసి మిక్సీ పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసుకుని బాదం పప్పు, జీడి పప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్లీ కాస్త నెయ్యి వేసుకుని రాగి పిండిని వేయించుకోవాలి. ఆ పిండిలో వేయించిన బాదం, జీడి పప్పు, కొబ్బరి తురుము, నువ్వులు వేసి కలుపుకోవాలి. అదేవిధంగా బెల్లం తురుము, కొంచెం యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం చల్లారిన రాగి పిండి మిశ్రమాన్ని నెయ్యి రాసుకుంటూ లడ్డుల్లా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యాన్ని అందించే రాగి లడ్డూ రెడీ.
© 2023 - 2025 Millets News. All rights reserved.